అవినీతిని పట్టించుకోరు కానీ.. దేశాన్ని రక్షిస్తారా?

19 Nov, 2018 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో పేరుకుపోయిన అవినీతిని పట్టించుకోడు.. కానీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశాన్ని రక్షిస్తానని చెప్పడం విడ్డురంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతి...టీడీపీ నాయకుల అక్రమాలపై కేంద్రం స్పందించకవడం దారుణమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ. 20 వేల కోట్లు ఇస్తే...7 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఏడు వందల కోట్ల రూపాయలను ఒక మీడియాలో ప్రచారం కోసం ఇచ్చారన్నారు. రూ. 450 కోట్లు విలువ గల భూమిని 45 లక్షల రూపాయలకే ప్రభుత్వం కేటాయించిన దాఖలాలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారా స్థాయికి చేరిందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారని విమర్శించారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అవకతవకలు...విశాఖపట్నం భూముల కుంభకోణం..ఇలాంటి వాటిని బాబు పట్టించుకోరని విమర్శించారు. టీడీపీ నాయకుల బండారం బయటపడుతుందనే సీబీఐ ప్రవేశ రద్దుపై జీవో తెచ్చారని ఆరోపించారు. తప్పులు చేసి బయట దేశాలకు పారిపోయిన విధంగా...దేశంలో తప్పు చేసిన నాయకులు ఏపీ లో తలదాచుకునే విధంగా బాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులాంటి మోసకారితో కాంగ్రెస్‌ జతకట్టడమేంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు చంద్రబాబు అవినీతి పాలన పై మాట్లాడవలసిన అవసరం ఉందని బోత్స అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు