సాక్షి, కడప : అసలే ఆయన చంద్రబాబు.. ప్రసంగం మొదలుపెట్టారంటే.. గంటన్నర మాట్లాడితే కానీ ఆపరు. అంతటి ప్రసంగాన్ని విని తట్టుకోవాలంటే సహజంగానే ప్రజల వశం కాదు. అందుకే చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే జనం మెల్లిగా ఆయన సభల నుంచి జారుకుంటూ ఉంటారు. ఇక, ఆయన స్పీచ్ అంటే సొంత పార్టీ కార్యకర్తలు సైతం హడలిపోతారు. కాస్తా సమయం చిక్కితే అక్కడినుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది ప్రతి చోటా జరిగే తంతే.
శనివారం కడపలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దీక్ష విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు స్పీచ్ సందర్భంగా ఇదే పునరావృతం అయింది. కానీ, కడప నేతలు, అధికారులు జనం సభ నుంచి జారుకోకుండా కొత్త చిట్కా కనిపెట్టారు. చంద్రబాబు ప్రసంగం ముగిసేవరకు.. గేట్లకు తాళం వేసి.. జనం బయటకు వెళ్లకుండా కాపలా కాశారు. సీఎం రమేష్ దీక్ష విరమింపజేసేందుకు సీఎం చంద్రబాబు రావడంతో.. జిల్లావ్యాప్తంగా వందల బస్సులు పెట్టి డ్వాక్రా సంఘం మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలను తరలించారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే వారు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మహిళలు గేట్ల వద్దకు పెద్దసంఖ్యలో వచ్చారు. అయితే, వారు సభ నుంచి బయటకు వెళ్లకుండా.. గేట్లకు తాళం వేశారు. దీంతో గత్యంతరం లేక.. బయటకు వెళ్లలేక.. లోపలికి వెళ్లి చంద్రబాబు ఉపన్యాసం వినలేక.. గేట్ల వద్దే ఉండిపోయారు.
కడపలో సీఎం చంద్రబాబు ప్రసంగం సందర్భంగా మహిళలు బయటకు రాకుండా పోలీసులు కాపలాగా ఉన్న దృశ్యం