ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్‌ నిజ నిర్ధారణ కమిటీ

28 Feb, 2020 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతిని కోరారు. అలాగే ఢిల్లీలో అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సోనియా గాంధీ తెలిపారు. ఈ బృందం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కమిటీలో ముకుల్‌ వాస్నిక్‌, తారిక్ అన్వర్, సుష్మితా దేవ్, శక్తిసిన్హా గోహిల్‌, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు. 

ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సోనియాగాంధీకి అందజేయనున్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 42 మంది మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు. 

చదవండి : ఢిల్లీ అల్లర్లు : రాహుల్‌, ప్రియాంకలపై పిటిషన్‌

వందల్లో ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోరా?

ఐబీ అధికారి హత్య : గంటల పాటు సాగిన అరాచకం

ఢిల్లీ ప్రశాంతం..!

మరిన్ని వార్తలు