దీపావళి నాడే ఆ దేశ వస్తువులు వాడొద్దంటారు కానీ..

29 Oct, 2019 16:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్‌ మాట్లాడుతూ.. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశియ ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉంటే స్టీల్‌, పారామెడికల్‌,పుడ్‌ ప్రాసెసింగ్‌, ఈ కామర్స్‌ రంగాలపై మరింత ప్రభావం ఉంటుందని ట్రేడ్‌ కౌన్సిల్‌ హెచ్చరించినా.. నరేంద్రమోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

నిత్యవసర వస్తువులపై టాక్స్‌ పెంచి లగ్జరీ వస్తువులపై టాక్స్‌ తగ్గించడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. 2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ.. ఉన్న ఆదాయాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. మేక్‌ ఇన్‌ ఇండియాను సేల్‌ ఇన్‌ ఇండియాగా మార్చారని ఎద్దేవా చేశారు. దీపావళి సమయంలో మాత్రమే బీజేపీ నేతలు చైనా వస్తువులను వాడొద్దని ప్రచారం చేస్తారని, కానీ మిగిలిన సమయంలో మళ్లీ వారి ప్రభుత్వమే టాక్స్‌ లేకుండా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటుందని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోదని గౌరవ్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు