‘పవన్‌ ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజం’

20 Apr, 2018 11:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది దొంగ జపం.. దొంగ దీక్ష అని సీపీఎం నాయకుడు మధు విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రంతో చేతులు కలిపిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రత్యేకహోదా నినాదాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిందన్నారు. హోదా కోసం ఉద్యమాలు, బంద్‌లు చేపడితే పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. యువత, విద్యార్థులపై పీడీ యాక్టులతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

ఈ నెల 16న బంద్‌కు పిలుపునిస్తే.. బంద్‌లు ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తాయి తప్ప, హోదా వస్తుందా అన్నారన్నారు. గతంలో హోదా వద్దని ఇపుడు ఆయనే హోదా కావాలంటారు.. అవిశ్వాసం అవసరం లేదని అవిశ్వాసం పెడతారని మండిపడ్డారు. దీక్షలో టీడీపీ కార్యకర్తలు తప్ప ప్రజల మద్దతు లేదన్నారు. హోదాపై తీర్మానం ఉంటుందన్నారు. ఈనెల 24న హోదా సాధనకోసం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని.. ఆ రోజు బ్లాక్‌డే కూడా పాటిస్తామని మధు స్పష్టం చేశారు. 

మరో వైపు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మధు స్పందించారు. చంద్రబాబుపై పవన్‌ చేసిన ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజమని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు