సాక్షి, హైదరాబాద్ : రెండు నెలలకు పైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తెలంగాణ.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. 119 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2 కోట్ల 80 లక్షల, 64 వేల ఓటర్లు తమ తీర్పుతో తేల్చనున్నారు. సంక్షేమ పథకాలు తమ అభివృద్ధే నినాదంగా అధికార పార్టీ టీఆర్ఎస్ బరిలోకి దిగగా.. కేసీఆర్ను గద్దే దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ప్రచారం సాగించింది. గులాభి అధినేత కేసీఆర్ గజ్వేల్లోనే ప్రచారం ప్రాంభించి అక్కడే ముగించగా.. మహాకూటమి ఆలంపూర్లో ప్రారంభించి.. కోదాడ బహిరంగ సభతో ముగించింది.
ప్రచార పర్వం ముగియడంతో.. ఎన్నికల కమిషన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం.. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్దమని స్పష్టం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత 13 నియోజక వర్గాలు.. సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)లలో ఓ గంట ముందు నుంచే నిషేధం విధించమన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలల్లో వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాలకు కూడా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.