నీ నాలుక చీరేస్తా బిడ్డా.. జాగ్రత్తా! : హరీష్‌ రావు

5 Nov, 2018 20:14 IST|Sakshi

సిద్దిపేట : పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక చీరేస్తా బిడ్డా జాగ్రత్తా.. అంటూ రేవూరి ప్రకాష్‌ రెడ్డిని ఆపద్దర్మ మంత్రి హరీష్‌ రావు హెచ్చరించారు. గజ్వేల్‌లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఏ క్షణంలోనైనా చీలిక రావచ్చని రేవూరి చేసిన వ్యాఖ్యలపై హరీష్‌ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచినా మంచి నీళ్లు ఇయ్యని దిక్కుమాలిన వారంటూ  కాంగ్రెస్‌ నాయకులపై ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 11 తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రతాప రెడ్డి, నర్సారెడ్డిలు జోగడు బాగాడు లెక్క తయారయ్యారని విమర్శించారు.

కేసీఆర్‌ వచ్చుడు ముఖ్యమంత్రి అవ్వడం మన అదృష్టమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ప్రతి చెరువు కుంటలు నిండాలని కేసీఆర్‌ అన్నారని, చెరువులు నింపుడు గీ కాంగ్రెస్‌ వాళ్లతో అయితదా మీరే ఆలోచించండని ప్రజలను కోరారు. కన్న కొడుకు చీరలు కొనియ్యక పోయినా మా అక్కచెల్లెలందరికీ కేసీఆర్‌ పంచాడని గుర్తు చేశారు. ప్రజలు ఓటుతోని కాంగ్రెస్‌ వాళ్లకి గుణపాఠం చెబుతామంటున్నారని అన్నారు. ముదిరాజులు పాండవుల వంటి వారు న్యాయం వైపే ఉంటారని అన్నారు. అదే గెలుస్తుందన్నారు. ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఇంత గొప్ప సభను ఏర్పాటుచేసిన ముదిరాజులకు ధన్యవాదాలను తెలిపారు. పదిహేడు సంవత్సరాల పాటు నా జీవితం గజ్వేల్‌​నియోజకవర్గంలో కొనసాగిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు పక్కా భవనాలను కట్టిస్తున్నదని గుర్తుచేశారు. 

>
మరిన్ని వార్తలు