సీఎం జగన్‌కు సహకరిస్తా: జనసేన ఎమ్మెల్యే

12 Jun, 2019 16:36 IST|Sakshi
అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే వరప్రసాద్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ తొలిరోజు సమావేశాలు సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్‌తో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్‌ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. ఆయనతో సీఎం జగన్‌ కొద్దిసేపు మాట్లాడి సభలోకి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటించారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.  

అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌)

మరిన్ని వార్తలు