మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా

20 Mar, 2020 12:37 IST|Sakshi

బలపరీక్షకు ముందే కమల్‌ రాజీనామా

బీజేపీపై తీవ్ర విమర్శలు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాగా సీఎంగా ‍ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కమల్‌నాథ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారని, కానీ తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. (16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్‌ ఆమోదం)


కాగా గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం గెలుపొందడం అంత తేలిక కాదని తేలిపోయింది. దీంతో బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో భోపాల్‌లో మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు