సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు సీఎం యడియూరప్ప. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా నియమించేందుకు వీలుంది. అయితే యెడ్డీ తన తొలి కేబినెట్లో 13మంది మంత్రులను మాత్రమే తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మిగతా ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా జూలై 26న ప్రమాణస్వీకారం చేశారు బీఎస్ యడియూరప్ప. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఆలస్యమైంది.