సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు.
‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు.
చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే