దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం

7 Dec, 2023 06:01 IST|Sakshi

లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌

న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్‌ కుమార్‌ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ, డీఎంకే సీనియర్‌ నేత టీఆర్‌ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు.

దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్‌ కుమార్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్‌ డిమాండ్‌ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్‌ బాలు స్పందిస్తూ.. సెంథిల్‌ కుమార్‌ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్‌ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్‌ కుమార్‌ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.  

సభలో సెంథిల్‌ కుమార్‌ క్షమాపణ  
తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్‌ కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.   

భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్‌ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు