కొండా దంపతులపై కేసీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు

26 Nov, 2018 20:20 IST|Sakshi

సాక్షి, వరంగల్ : ‘రౌడీయిజానికి భయపడం.. వారికేమైనా చేతులు ఎక్కువున్నాయా?.. ప్రజలను చూసి రౌడీలే భయపడాలి’ అని కొండా దంపతులను ఉద్దేశించి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం వరంగల్లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి మరోసారి పరీక్ష ఎదురైందని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్‌.. ఆంధ్ర నుంచి వలస అధిపత్యం తీసుకొస్తుందన్నారు.

తెలంగాణకు చంద్రబాబు అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల అనంతరం తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలు పోతాయని సమైక్యాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శాపనార్దాలు పెట్టాడని గుర్తు చేశారు. ఈ రోజు ఏపీలో 24 గంటల కరెంట్ లేదని, కానీ తెలంగాణలో మాత్రం అన్ని వర్గాలకు నిరంతరం విద్యుత్ అందిస్తున్నామన్నారు. పోరాటల గడ్డమీద తెలుగుదేశం అభ్యర్థి పోటీలో ఉండటం మనకు సిగ్గుచేటన్నారు. వరంగల్‌ ప్రజలు చైతన్యవంతమైన తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు