ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్‌ నేతలు

15 Nov, 2018 05:30 IST|Sakshi
ఏకే ఆంటోనీ

సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్‌ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్‌ సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిరాహార దీక్షకు దిగారు.  షాద్‌నగర్‌ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్‌ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్‌గౌడ్‌లు దీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు