సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు, అన్యమత చిహ్నాలను చెక్కించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అది కేసీఆర్ ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తెలిపారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి ఇదేమీ కొత్తకాదనీ, గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను సొంత పార్టీ కార్యక్రమాల్లా టీఆర్ఎస్ గులాబీ రంగులు విరివిగా వినియోగించారన్నారు.