మీకు సోము వీర్రాజే సరిపోతాడు...

2 Apr, 2018 16:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పైడికొండల మాణిక్యాలరావు పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి...అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌ అంటూ మాణిక్యాలరావును అభినందించారు.

అయితే తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం లేదని, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవుతారని, ఆయన పేరు ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా నన్నపనేని మాట్లాడుతూ.. మీరే అధ్యక్షుడని అందరు అనుకుంటున్నారని అనగా, మీకు సోము వీర్రాజే సరిపోతాడంటూ మాణిక్యాలరావు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు మంత్రి కళా వెంకట్రావు కూడా మాణిక్యాలరావును చూసి..కొత్త శత్రువులకు నమస్కారం అంటూ నవ్వుతూ పలకరించారు.

మోదీ మహిళలను బాధ పెడుతున్నారు..

ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ..‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీలోని రెండున్నర కోట్ల మంది మహిళలను పెడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే మోదీకి నోటీసులు పంపుతాను. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ బాగా బాధ పడుతున్నారు. మోదీ, బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ స్పీకర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని అవమానాలు భరించడం దేనికంటూ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాస్తాను.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు