31న స్పష్టత ఇస్తా!

27 Dec, 2017 04:46 IST|Sakshi
మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అభిమానితో రజనీకాంత్‌

రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్‌ ప్రకటన

రాజకీయాలు తెలియక కాదు..బాగా తెలియడం వల్లే ఈ ఆలస్యం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ నెల 31న తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టత ఇస్తానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించారు. ‘రాజకీయాలు నాకు కొత్త కాదు, 1996లోనే రాజకీయ ప్రవేశం చేశా. రాజకీయాలు తెలియక ఆలస్యం చేయడం లేదు. తెలుసుకాబట్టే బాగా ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో కష్టనష్టాలు తెలుసు. యుద్ధంలోకి వెళితే జయించి రావాలి. ఇందుకు వీరత్వం ఒక్కటే సరిపోదు. వ్యూహం కూడా అవసరం. నా రాజకీయ ప్రవేశంపై అందరూ ఎదురు చూస్తున్నారు. దీనిపై ఈనెల 31వ తేదీన ప్రకటిస్తాను’ అని అభిమాను లనుద్దేశించి రజనీ మాట్లాడారు. 31న ప్రకటన చేస్తానని రజని చెప్పగానే అభిమానులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేయడంతో.. ‘రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సంబంధించి ప్రకటన చేస్తానని మాత్రమే చెప్పాను’ అని మరోసారి నర్మగర్భంగా మాట్లాడారు.

గత కొన్నాళ్లుగా రజని రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. 31న రజనీ ఇచ్చే ప్రకటన ఆ ఊహాగానాలకు తెర వేస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మేలో 16 జిల్లాలకు చెందిన అభిమానులతో మొదటి విడత భేటీని పూర్తి చేసుకున్న రజనీకాంత్‌.. మంగళవారం రెండో విడత భేటీని ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఐదు జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది అభిమానులను ఆయన కలుసుకుంటారు. ఈ సమావేశాలకు ‘భైరవి’ తమిళ చిత్రం ద్వారా రజనీని హీరోగా పరిచయం చేసిన నిర్మాత కలైజ్ఞానం, సినీ దర్శకుడు మహేంద్రన్‌లను రజని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు