సాక్షి, కొండగట్టు(జగిత్యాల) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత, సినీ నటుడు పవన్కల్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. కొండగట్టులో ఆంజనేయస్వామికి పూజల అనంతరం ఆలయ అధికారులను కలిసిన పవన్ కళ్యాణ్.. రూ.11 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు.. త్వరలోనే విరాళం అందజేస్తానని చెప్పినట్టు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు.
రాజకీయ యాత్రను ఆరంభించబోయే ముందు కొండగట్టులో వెలసిన అంజనీపుత్రుడిని దర్శించుకుంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి 50 కార్ల భారీ కాన్వాయ్తో కొండగట్టు చేరుకున్న పవన్కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కరీంనగర్ చేరుకున్నారు. సాయంత్రం రాజకీయ యాత్రపై మీడియాతో మాట్లాడనున్నారు.