కేటీఆర్‌ రోడ్‌ షో పేలవంగా ఉంది: పొన్నం

5 Oct, 2019 13:30 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం.. కేటీఆర్‌  నిర్వహించిన రోడ్‌షో పేలవంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని, టీఆర్‌ఎస్‌ వస్తే.. అప్పులు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. కేటీఆర్‌ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హంగు, ఆర్భాటాలే తప్ప.. ఎక్కడా అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. కాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి తరుఫున జరిగిన రోడ్ షోలో పొన్నం పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని పొన్నం విమర్శించారు. కేసీఆర్‌ కావాలనే టీఎస్‌ఆర్టీసీని నిర్వీర్యం చేసి, భారీ నష్టాల్లో కూరుకుపోయిందని లెక్కలు చూపి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నారని  అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు