ప్రచారానికి లెఫ్ట్‌ అగ్రనేతలు 

25 Nov, 2018 02:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు వస్తున్నారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ కూటమి పక్షాన ప్రచార కార్యక్రమాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ తదితరులు పాల్గొంటారు. ఈ నెల 29న మహబూబ్‌నగర్, 30న జుక్కల్, చెన్నూరు ఎన్నికల ప్రచారసభల్లో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రసంగిస్తారు. డిసెంబర్‌ 3న మహబూబాబాద్, ఖమ్మం, 4న మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏచూరి ప్రచారం చేస్తా రు. డిసెంబర్‌ 1న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, 2న కోదాడ, హుజూర్‌నగర్, 3న జనగామ నియోజకవర్గ ప్రచారంలో మాణిక్‌ సర్కార్‌ పాల్గొంటారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 30న భద్రాచలం, 1న ఖమ్మం జిల్లా, 2న గద్వాల, 3న నిజామాబాద్‌లో రెండో విడత ప్రచారాన్ని నిర్వహిస్తారు. మహిళానేత బృందాకారత్‌ కూడా రెండో విడత ప్రచారం చేస్తారు.

మూడు చోట్ల సీపీఐ ప్రచారం.. 
కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మూడు సీట్లలో పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ జాతీయ ›ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో 3 నియోజకవర్గాల పరిధిలో సురవరం ప్రచారం చేస్తారు. ఈ నెల చివరి వారంలో పార్టీ పోటీ చేస్తున్న చోట్ల నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.  

మరిన్ని వార్తలు