ఆ వ్యాఖ్యలు కాకతాళీయం: బీజేపీ ఎమ్మెల్యే

28 Jan, 2018 13:31 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

విశాఖపట్నం : ఈ నెల 24వ తేదీన తాను వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..తాను పీఏసీ సభ్యుడిగా ఆ సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. అది వైఎస్సార్‌సీపీ కార్యాలయం అనేది వాస్తవమన్నారు. సమీపంలోవున్న కార్యాలయాన్ని మీడియాతో మాట్లాడేందుకు ఉపయోగించుకోవడమే వివాదానికి కేంద్రబిందువైందన్నారు. అసందర్బంగా అడిగిన ప్రశ్నకు తాను స్పందించడమే సంచలనానికి కారణమైందన్నారు. 

పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం తప్పే అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. అది నా వ్యక్తిగత అభిప్రాయమని, దీన్ని రాజకీయకోణం నుంచి చూడాల్సిన అవసరంలేదన్నారు. తాము సంకీర్ణధర్మాన్ని పాటిస్తామని, పొత్తుల గురించి మాట్లాడే స్ధాయి తనది కాదని, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. అసెంబ్లీ లాబీలో సెక్యూరిటీ అధికారి వద్దనడంతోనే వైస్సార్సీపీ  కార్యాలయంలో మీడియాతో మాట్లాడానని చెప్పారు. తాను వైస్సార్సీపీ లో చేరడం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు