‘ఆ ఎమ్మెల్యేకు మాటలు ఎక్కువ, పని తక్కువ’

26 Sep, 2018 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గాలి వీస్తుందని, అందరూ కేసీఆర్‌ వైపే చూస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు తెలంగాణ సాధకులకు, ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయని విమర్శించారు.

తెలంగాణ వివక్షకు కారణమైన కాంగ్రెస్‌, అన్యాయం చేసిన టీడీపీలు ఒక్కటయ్యాయని దుయ్యబట్టారు. కేంద్రం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి మాటలు ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు