‘వాళ్లు అధికారంలోకి వస్తే జీవోలు కూడా విజయవాడ నుంచే’

21 Nov, 2018 17:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాకూటమి ముసుగులో చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ జీవోలు విజయవాడ నుంచి విడుదల అవుతాయన్నారు. బుధవారం  అంబర్‌పేటలో నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల సభకు కేటీఆర్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. న్యాయవాదుల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిదని గుర్తు చేశారు. హైకోర్టు విభజనను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారుని ఆరోపించారు. హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు కేసులు బయట పడతాయని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.


జడ్జీల నియామకంలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరుగుతుందని, కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జూనియర్‌ న్యాయవాదుల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. కులాల, మతాలు, ప్రాంతాలుగా ప్రజలను విడగొట్టి మహాకూటమి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. సీమాంద్ర ప్రజల సమష్టిని మహాకూటమి తక్కువ అంచనా వేస్తుందని.. వాళ్లే కూటమికి బుద్ది చెబుతారన్నారు. నాలుగున్నరేండ్లలో నాలుగు సెకన్లు కూడా కర్ప్యూ లేకుండా పాలించిన దమ్మున్ననేత కేసీఆర్‌ అని తెలిపారు. నాలుగు పార్టీలు కలిసి 40 సీట్లు పంచుకోలేనోళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ సీఎం అవుతారు.. మరి కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవి చిన్న పిల్లపిల్లల కుర్చిలాటలాగే అవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ సింహింలా సింగిల్‌ వస్తుందని.. మరో సారి అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు.

మరిన్ని వార్తలు