సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల ధరలు పడిపోతున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అమరావతిని ఖూనీ చేశారని విమర్శించారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ ధరలు పతనం అయ్యాయని చంద్రబాబు గింజుకోవడం వెనుక అసలు కథ వేరే ఉందన్నారు. చంద్రబాబు ఇన్ సైడర్ ట్రెడింగ్తో తన బినామీలకు, బంధు గణానికి భూములు దక్కలే ముందే ప్లాన్ అందజేశారని ఆరోపించారు. ఇప్పుడు వారి చేతిలో 30 వేల ఎకరాలు భూమి ఉందని.. రియల్ ఎస్టేట్ పతనం అయితే వారు రోడ్డున పడతారనే బాధతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ట్విటర్లో పేర్కొన్నారు.
అమరాతి జపాన్కు రెండో రాజధాని అయ్యిందా?
మరో ట్వీట్లో అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు గతంలో చెప్పిన మాటలను ప్రస్తావించిన విజయసాయిరెడ్డి.. ఐదేళ్లలో వాటిని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ‘అమరావతి జపాన్కు రెండో రాజధాని అవుతుందని చెప్పారు. 15 ఓడరేవుల అభివృద్ధికి ఆ దేశం సహకరిస్తుందని కూడా అన్నారు. అమరావతి-టోక్యోల మధ్య డైరెక్టు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. సూళ్లలో పిల్లలకు జపనీస్ నేర్పిస్తామ’ ని చంద్రబాబు గతంలో అడ్డగోలు కోతలు కోశారని మండిపడ్డారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చెప్పిన పెట్టుబడి ఒక్కటైనా వచ్చిందా అని ప్రశ్నించారు.