సోమిరెడ్డిని నిలదీసిన గ్రామస్తులు

20 Mar, 2018 11:40 IST|Sakshi

వెంకటాచలం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ అనకాడ వడ్డిపాళెం గ్రామస్తులు నిలదీశారు. మంత్రి సోమిరెడ్డి కసుమూరు పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా అనకాడ వడ్డిపాళెం వద్ద రోడ్డుపై గ్రామస్తులు నిలబడ్డారు.

వారిని గమనించిన మంత్రి తన కారును నిలపగా గ్రామస్తులు ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకుపోయారు. వడ్డిపాళెంలో రోడ్లు, పారిశుద్ధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. గ్రామ అభివృద్ధి గురించి మీరు పట్టించుకోరా?అని నిలదీశారు. సమస్యలను అనేక సార్లు స్థానిక టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పురోగతిలేదని ఆరోపించారు. తమ గ్రామంలో ఏం అభివృద్ధి పనులు చేశారని మహిళలు మంత్రి సోమిరెడ్డిని నిలదీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపారు. అనంతరం మంత్రి కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు