‘ఖాళీగా ఉన్నప్పుడే పవన్‌ విమర్శిస్తారు’

15 Nov, 2018 14:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కులాలతో సంబంధం లేందంటూనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కులాల గురించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడితో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ను ఎదిరించానని గొప్పలు చెప్పుకుంటున్న పవన్‌.. అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబులాగే పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. (అప్పటివరకూ పవన్‌ హాలీడేస్‌లో ఉన్నారా)

ఖాళీగా ఉన్నప్పుడే వచ్చి విమర‍్శలు చేయడం కాదు ప్రజల తరపున పోరాడాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాడారు.. అలాంటి కార్యక్రమం పవన్‌ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న విషయంలో పవన్‌ చంద్రబాబులాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ డైరెక్షన్‌లో పవన్‌ నడుస్తున్నారని ఆరోపించారు. 

బాబూ..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తొచ్చిందా
మహానేత వైఎస్సార్‌ మురణం తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎవరూ పట్టించుకోలేదని బొత్స ఆరోపించారు. నాలుగున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయంలో శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి ఇంతవరకూ పూర్తిచేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ హయంలో 95శాతం పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టును ఇప్పటి వరకూ 5శాతం కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను 17వేల కోట్ల రూపాయాలతో పూర్తి చేస్తామన్న చంద్రబాబు..ఇప్పుడు రూ. 52వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. మూడు రెట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సుజల స్రవంతి ప్రాజెక్టుని పూర్తి చేస్తామని బోత్స హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు