ప్రజలు డబ్బులు ఇస్తే.. మీరేం చేస్తారు?

30 Mar, 2018 19:37 IST|Sakshi
కురసాల కన్నబాబు(ఫైల్‌ ఫోటో)

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు 

సాక్షి, కాకినాడ : రాజధాని అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చిందే కాకుండా అప్పులు కూడా ఇవ్వాలా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మట్టి నుంచి బూడిద వరకు దోచుకున్న టీడీపీ నాయకులను, లంచాలు నొక్కుతున్న జన్మభూమి కమిటీలను రాజధాని కోసం డబ్బులు అడగండని సీఏం చంద్రబాబునాయుడుకు సూచించారు.

నాలుగేళ్లలో లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేశారని అందులో పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టలేరా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు తాత్కాలిక భవనాలే కట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అని చెప్పారని, కానీ ఈ రాష్ట్రంలో లోకేశ్‌కు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదని కన్నబాబు ఎద్దేవ చేశారు.   

చిత్త శుద్ధి ఉంటే రాజీనామాలు చేయండి
ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణంపై చంద్రబాబు వ్యవహరిస్తున్న ద్వంద వైఖరిపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని అక్రమంగా అరెస్టులు చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రత్యేక హోదాపై చిత్త శుద్ధి ఉంటే వెంటనే ఎంపీలతో రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించినప్పుడు అవసరంలేని అఖిలపక్షం ఇప్పుడు అవసరం వచ్చిందా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పై చంద్రబాబు డ్రామాలు ఆపి తమ పార్టీతో కలిసి రావాలని కన్నబాబు హితవు పలికారు.

మరిన్ని వార్తలు