రజనీ బీజేపీకి కొమ్ము కాస్తున్నారు

13 Apr, 2018 08:14 IST|Sakshi

దర్శకులు భారతీరాజా, అమీర్‌ విమర్శలు

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ బీజేపీకి కొమ్ముకాస్తున్నారని సినీ దర్శకులు భారతీరాజా, అమీర్, నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ విమర్శించారు. కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు, ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలను చెన్నైలో రద్దు చేయాలని బుధవారం సినీ ప్రముఖులతో పాటు పలువురు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ గాయపడ్డారు. దీంతో నామ్‌ తమిళర్‌ పార్టీకి చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. దీనిపై స్పందించిన రజనీకాంత్‌ హింసకు పరాకాష్ట అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాఉండగా రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా, అమీర్, గౌతమ్, నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలో కొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయని, అవేవీ హింసాత్మకం కాదన్నారు. కావేరి సమస్యపై కర్ణాటకలో తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు రజనీకాంత్‌ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రజనీ వ్యాఖ్యలు ఎవరి డబ్బింగో అని పరిహసించారు. రజనీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై స్వాగతించడం చూస్తుంటే ఆయన బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి పొన్‌రాధాకష్టన్, తమిళిసై సౌందర్‌రాజన్‌లు తమిళులకు ద్రోహం చేస్తున్నారని, అరెస్ట్‌ చేసిన నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమది భవిష్యత్తు తరాల కోసం చేసే పోరాటం అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు