ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతిని ఖండించిన మోదీ

17 Nov, 2023 12:04 IST|Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు.

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. ఈ ఏడాది రెండోవసారి జరుగుతున్న ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నన్నారు. భారత్ సారథ్యంలో జరగుతున్న ఈ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్‌ సౌత్‌ మధ్య ఐక్యత, సహాకరం అత్యవసరమని పేర్కొన్నారు.

హింస, ఉగ్రవాదానికి భారత్‌ వ్యతిరేకమని మరోసారి మోదీ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను కూడా ప్రధాని ఖండించారు. ఇరు దేశాల మధ్య వివాద పరిష్కారానికి సంయమనం పాటించాలని కోరారు. యుద్ధం ఆపేసి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. 
చదవండి: భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

‘అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్‌ జరిగిన ఉగ్రవాద దాడిని భారత్‌ ఖండించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత్‌ సంయమనం పాటించింది. చర్చలు, దౌత్యా మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించేందుకు భారత్‌ ప్రాధాన్యత ఇస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నా. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడిన అనంతరం పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా పంపాము. గ్లోబల్‌ సౌత్‌లోని దేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం ఇది’ అని మోదీ పేర్కొన్నారు.

కాగా గ్లోబల్ సౌత్ అనేది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దక్షిణ అమెరికాలోని దేశాల సమాహారాన్ని సూచిస్తుంది. ఇది 21వ దశాబ్దంలో మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన వేదిక. ఇందులో వందకు పైగా దేశాలున్నాయి. కలిసికట్టుగా.. అందరి అభివృద్ధి కోసం.. అందరి నమ్మకంతో’’ అనే థీమ్‌తో ఈసారి గ్లోబల్ సౌత్ సదస్సు జరుగుతోంది. 

ఇక హమాస్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు.మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 11,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణౠలు కోల్పోయారు. ఇదిలా ఉండగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్‌సైన్యం ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘ఆస్పత్రిలోని హమాస్‌ సొరంగం నెట్‌వర్క్‌ను గుర్తించామంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు