‘అవును.. ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది’

3 Apr, 2019 12:21 IST|Sakshi

జైపూర్‌ : ఐపీఎల్‌ సీజన్‌-12లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో రహానే సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌.. పాయింట్ల ఖాతా తెరిచింది. అద్భుత బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు తీసిన శ్రేయస్‌ గోపాల్‌ దెబ్బకు బెంగళూరు ముందే చేతులెత్తేయగా... బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో రహానే బృందం మ్యాచ్‌ గెలుచుకుంది. టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ సారథి రహానే ఫీల్డింగ్‌కు మొగ్గుచూపి.. బెంగళూరును  బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో పార్థివ్‌ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లి (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఓ సాధారణ స్కోరుకే పరిమితం కాగా.. పార్థివ్‌ మాత్రం ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌ బౌలర్లు శ్రేయస్‌ గోపాల్‌,  క్రిష్ణప్ప గౌతం స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఇక కెప్టెన్‌ రహానే(22), జోస్‌ బట్లర్‌(59) అద్భుత ఓపెనింగ్‌తో జట్టు విజయానికి బాటలు పరిచారు.

చదవండి : (ఆర్సీబీపై రాజస్తాన్‌ ఘన విజయం)

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘ అవును.. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉంది. పాయింట్ల ఖాతా తెరచి పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకున్నాం. పవర్‌ ప్లేలో గౌతం చాలా అద్భుతంగా బౌల్‌ చేశాడు. ఆ తర్వాత కోహ్లి, డివిల్లియర్స్‌ వికెట్లు తీసి శ్రేయస్‌ గోపాల్‌ ఓ రకంగా రికార్డు సృష్టించాడని చెప్పుకోవాలి. గత మూడు మ్యాచుల్లోనూ బాగానే ఆడాం కానీ ఇప్పుడు 100 శాతం ఫలితం సాధించాం. ఇక త్రిపాఠి ఈ మ్యాచ్‌కు ముందు కాస్త తడబడ్డాడు. కానీ స్టోక్సీ, స్మిత్‌లతో కలిసి రాణించాడు. జట్టు సమిష్టి కృషి వల్లే విజయం సాధించాం అని హర్షం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు