హ్యాట్రిక్‌ విజయంతో ఫైనల్‌కు..

10 Feb, 2018 17:45 IST|Sakshi
ఇంగ్లండ్‌ వికెట్‌ తీసిన ఆనందంలో ఆసీస్‌ ఆటగాళ్లు

మెల్‌బోర్న్‌:న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శనివారం​ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సిరీస్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని ఆసీస్‌ ఖాతాలో వేసుకుని ముందుగా ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ ఘన విజయాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ రోజు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌(46), శ్యామ్‌ బిల్లింగ్స్‌(29)లు మాత్రమే మోస్తరుగా రాణించగా మిగతావారు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్‌ బౌలర్లలో కేన్‌ రిచర్డసన్‌ మూడు వికెట్లు సాధించగా, స్టాన్‌లేక్‌ రెండు వికెట్లు తీయగా, టైకు వికెట్‌ దక్కింది. ఆపై 138 పరుగుల సాధారణ లక్ష్యంతో  బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. ఆసీస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(2) నిరాశపరిచినప్పటికీ, ఆర్సీ షాట్‌(36), క్రిస్‌ లిన్‌(31), మ్యాక్స్‌వెల్‌(39), అరోన్‌ ఫించ్‌(20 నాటౌట్‌)లు సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌ సునాయాసంగా గెలుపొందింది.

మరిన్ని వార్తలు