కోహ్లి.. ఆలస్యంగా రాకు: ధోని

15 Mar, 2019 16:47 IST|Sakshi

హైదరాబాద్‌ : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)-2019 సందడి మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ హీట్‌ను పెంచేందుకు  ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్‌ స్పోర్ట్స్‌ విడుదల చేసిన టీజర్లు అభిమానులకు మత్తెక్కించగా.. తాజాగా ఐపీఎల్‌ విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది. అభిమానులు ఈ మెగా లీగ్‌ కోసం ఎంత ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారో.. తమ అభిమాన క్రికెటర్లపై పెట్టుకున్న అంచనాలు ఈ టీజర్‌లో కనిపిస్తాయి. అంతేకాకుండా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని ఇచ్చే స్వీట్‌ వార్నింగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.
(బుమ్రాపై కోహ్లి ఆగ్రహం‌‌..)
టీజర్‌ చివర్లో ధోని, కోహ్లి చాయ్‌ తాగుతూ.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ ఒకరికొకరు సవాల్‌ విసురుకుంటారు. సరే అంటూ వెళ్లిపోతున్న ధోని.. లేట్‌గా రాకు అంటూ కోహ్లికి ఓ సాఫ్ట్‌ వార్నింగ్‌ ఇవ్వడం వీడియోకే హైలెట్‌గా నిలిచింది. ఈ నెల 23 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ), ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఒకరికొకరు సలహాలు, సూచనలు చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ రణరంగంలో ప్రత్యర్థులుగా తలపడనుండటం, అందులోనూ తొలి మ్యాచ్‌ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న సీఎస్‌కే పై భారీ అంచానాలే ఉన్నాయి. ఇక ఈసారైనా టైటిల్‌ గెలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది.


(సాంబార్‌ పచ్చగా ఉంటుంది.. హే కాదు ఎర్రగా!)

మరిన్ని వార్తలు