17 ఏళ్ల తర్వాత..

19 Nov, 2018 02:12 IST|Sakshi

లంక గడ్డపై సిరీస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌

క్యాండీ: నిరీక్షణ ముగిసింది. 17 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై ఇంగ్లండ్‌ జట్టు టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 57 పరుగులతో విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 2001 తర్వాత లంక గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం. 2012 తర్వాత ఆసియాలో ఇంగ్లండ్‌ నెగ్గిన తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 226/7తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 243 పరుగులకు ఆలౌటైంది.

విజయానికి 75 పరుగులు చేయాల్సి ఉండగా... 17 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆట కేవలం అరగంటలోనే ముగిసింది. శ్రీలంక కోల్పోయిన మొత్తం 10 వికెట్లు ఇంగ్లండ్‌ స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. లెఫ్మార్ట్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 83 పరుగులిచ్చి 5 వికెట్లు... ఆఫ్‌ స్పిన్నర్‌ మెయిన్‌ అలీ 72 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ 52 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు కొలంబోలో శుక్రవారం నుంచి జరుగనుంది.   

మరిన్ని వార్తలు