ICC: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..

11 Nov, 2023 02:55 IST|Sakshi

ఐసీసీ నిర్ణయం

దుబాయ్‌: శ్రీలంక క్రికెట్‌ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది.

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్‌ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు.

అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్‌ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్‌కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు