ధావన్‌-రోహిత్‌ల జోడి అరుదైన ఘనత

9 Jun, 2019 16:49 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జోడి శిఖర్‌ ధావన్‌-రోహిత్‌ శర్మలు అరుదైన ఘనత సాధించారు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా వంద, అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా నిలిచింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్‌-ధావన్‌ల జంటకు ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌-మ్యాథ్యూ హేడెన్‌ల సరసన వీరు నిలిచారు. అదే సమయంలో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇది వన్డేల్లో రోహిత్‌-ధావన్‌లకు 16వ సెంచరీ భాగస్వామ్యం కాగా, అంతకుముందు కోహ్లితో కలిసి రోహిత్‌ శర్మ 16 సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమయ్యాడు. ఇదిలా ఉంచితే, 23 ఓవర్‌లో రోహిత్‌ శర్మ(57) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో భారత జట్టు 127 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను నష్టపోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు.  తొలి ఏడు ఓవర్ల వరకూ ఈ జోడి అత్యంత నెమ్మదిగా ఆడింది. దాంతో భారత జట్టు ఏడు ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులు మాత్రమే చేసింది. అటు తర్వాత ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా టచ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో ధావన్‌ 14 పరుగులు పిండుకోవడంతో భారత్‌ గాడిలో పడింది. ఆపై నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 53 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో ధావన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలుత ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త తడబడిన ధావన్‌.. ఆపై కుదురుకున్నాడు. బాధ్యయుతంగా ఆడి భారత్‌ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. ఈ క్రమంలోనే హఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. మరొకవైపు రోహిత్‌ కూడా సమయోచితంగా ఆడాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 21 ఓవర్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు రోహిత్‌.

మరిన్ని వార్తలు