మ్యాట్‌ హెన్రీ విజృంభణ

1 Jun, 2019 16:30 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ తన పదునైన బంతులతో చెలరేగిపోతున్నాడు.  తొలి ఓవర్‌ రెండో బంతికి లంక ఓపెనర్‌ లహిరు తిరుమన్నే(4)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన హెన్రీ.. తొమ్మిదో ఓవర్‌లో మరో రెండు వికెట్లు సాధించి శ్రీలంకకు షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్‌ మొదటి బంతికి కుశాల్‌ పెరీరా(29) ఔట్‌ చేసిన హెన్రీ.. ఆ మరుసటి బంతికి కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మెండిస్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. హెన్రీ దెబ్బకు శ్రీలంక 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో లంక ఇన్నింగ్స్‌ను తిరుమన్నే, కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నేలు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఫోర్‌ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన తిరుమన్నే ఆపై తదుపరి బంతికే వికెట్‌ను చేజార్చుకున్నాడు. దాంతో లంక నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఈ క్రమంలో కరుణరత్నేతో జత కలిసిన కుశాల్‌ పెరీరా ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటున్నట్లు కనిపించిన సమయంలో పెరీరీ భారీ షాట్‌కు యత్నించి ఔట్‌ కాగా, అటు తర్వాత కుశాల్‌ మెండిస్‌ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇక ధనుంజయ డిసిల్వా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు డిసిల్వా.  ఏంజెలో మాథ్యూస్‌ డకౌట్‌ కాగా, జీవన్‌ మెండిస్‌ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు.

మరిన్ని వార్తలు