‘అతడు లేకున్నా.. కప్‌ గెలిచి తీరుతుంది’

20 Jun, 2019 17:22 IST|Sakshi

సౌతాంప్టన్ : డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరంగేట్రం నుంచే టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో అతడికి అద్భుత రికార్డు ఉంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్‌ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్‌–రోహిత్‌ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్‌ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ మిగతా మ్యాచ్‌లకు ధావన్‌ దూరమవడం కచ్చితంగా టీమిండియాపై ప్రభావం చూపుతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ మాత్రం పై వ్యాఖ్యలను కొట్టిపారేశాడు.

శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా దూరమవడంతో టీమిండియాకు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆ జట్టులో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అతడి స్థానాన్ని భర్తీ చేసే సమర్థులు ఉన్నారు. దీంతో ధావన్‌ దూరం అయినా ప్రపంచకప్‌ టీమిండియాదే. ధావన్‌ దూరం కావడంతో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్‌ ముందు పెద్ద బాధ్యతే ఉంది. రాహుల్‌ నిరూపించుకనే సమయం వచ్చింది’అంటూ హస్సీ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ధావన్‌ దూరం కావడంతో పంత్‌ జట్టులోకి చేరాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మూడు విజయాలతో జోరు మీదున్న కోహ్లి సేన ఆరెంజ్‌ జెర్సీతో శనివారం అఫ్గానిస్తాతో తలపడనుంది.

చదవండి:
నేను వెళ్తున్నా.. ధావన్‌ భావోద్వేగం
‘ధావన్‌ గొప్ప పోరాటయోధుడు’

>
మరిన్ని వార్తలు