‘మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’

26 Aug, 2019 12:26 IST|Sakshi

లీడ్స్‌:  యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవడంతో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆసీస్‌ మాజీ కెప్టెన్లు.. పైనీనే ప్రధానంగా తప్పుబడుతున్నారు. ఫీల్డ్‌లో పైనీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా  ఇంగ్లండ్‌ చివరి వరుస ఆటగాడు జాక్‌ లీచ్‌ ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘ మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’ అని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ విమర్శంచగా, ‘ అనవసరంగా రివ్యూని వృథా చేసుకున్నాడు’ అని మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ ధ్వజమెత్తాడు.

‘ పైనీకి మతిభ్రమించినట్లుంది.  లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లడం ఏమిటి. అది క్లియర్‌గా లెగ్‌ సైడ్‌కు వెళుతున్నట్లు కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఉన్న ఒక్క రివ్యూను ఎలా వాడతాడు. అది ఔట్‌ కాదనే విషయం సహచర క్రికెటర్లకు అర్థమైంది. కానీ పైనీ మాత్రం ఏకపక్షంగా రివ్యూకు వెళ్లి అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు’ అని చాపెల్‌ విమర్శించారు.

లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లి దాన్ని కోల్పోవడంతో స్టోక్స్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో బంతి ప్యాడ్లకు తాకింది. దీనిపై ఆసీస్‌ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ జోయల్‌ విల్సన్‌ తిరస్కరించాడు. అయితే ఆసీస్‌కు రివ్యూ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే కట్టుబడాల్సి వచ్చింది.  ఆపై అది మిడిల్‌ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. ఒకవేళ ఆ సమయంలో స్టోక్స్‌ ఔటై ఉంటే ఆసీస్‌ గెలిచేది. ఆసీస్‌తో మ్యాచ్‌లో వికెట్‌ తేడాతోనే ఇంగ్లండ్‌ గెలవడానికి పైనీ తప్పుడు నిర్ణయమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు