వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’

24 Jun, 2019 08:42 IST|Sakshi
ప్రియురాలికీ పెళ్లి ప్రపోజల్ చేస్తున్న యువకుడు

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల జరిగిన భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విశ్వవేదికపై తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ భారత్‌ విజయకేతనం ఎగురవేయగా.. ప్రేక్షకుల గ్యాలరీలో ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి హృదయాన్ని గెలుచుకున్నాడు. ఆమె చేతికి రింగు తొడిగి తన జీవితభాగస్వామిగా సెట్ చేసుకున్నాడు. జూన్‌ 16 (ఆదివారం) భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. గ్యాలరీలో కూర్చున్న అన్వితా అనే యువతికి తన ప్రియుడు విక్కీ ఉంగరాన్ని చూపించి‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె అతడికి ‘ఒకే’ చెప్పడమే కాకుండా గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. అక్కడే ఉన్న వారి స్నేహితులు ‘వెల్ డన్ విక్కీ’ అంటూ మరింత ఉత్సాహపరిచారు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో ఈ సన్నివేశాన్ని చూసిన గ్యాలరీలోనియ ఇతర అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ వీడియోను అన్వితానే స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ వీడియో​ చూసిన నెటిజన్లు.. ‘సో స్వీట్‌’ అంటూ  కామెంట్‌ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఒక్కజోడినే కాదు కెనడాకు చెందిన దంపతులు కూడా అందరి మనసులు గెలుచుకున్నారు. ఇరుదేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్‌ వేసుకోని రెండు జట్లకు మద్దతు పలుకుతూ క్రీడా స్పూర్తిని చాటుకున్నారు. భర్తది పాకిస్తాన్‌ కాగా భార్యది భారత్‌. కెనడాలో నివసిస్తున్న ఈ ఇద్దరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఇలా ఇరుదేశాల జెర్సీలు ధరించి ఆస్వాదించారు. ఈ ఫొటో కూడా నెట్టింట హల్‌చేసింది.  (చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : మనసులు గెలుచుకున్న జంట)

మరిన్ని వార్తలు