వారి భాగస్వామ్యానికి జడేజా బ్రేక్‌

12 Jan, 2019 10:14 IST|Sakshi

సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆసీస్‌ స్కోరు 133 పరుగుల వద్ద ఉండగా ఉస్మాన్‌ ఖవాజా(59;81 బంతుల్లో 6 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు.  బ్యాటింగ్‌కు దిగిన దగ్గర్నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన ఖవాజాను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. జడేజా బౌలింగ్‌లో  ఖవాజా వికెట్లు ముందు దొరికిపోయాడు. భారీ షాట్‌ ఆడే యత్నంలో ఖవాజా ఎల్బీగా ఔటయ్యాడు. దీనిపై ఖవాజా డీఆర్‌ఎస్‌కు వెళ్లినా అతనికి నిరాశ తప్పలేదు. దాంతో ఖవాజా-షాన్‌ మార్ష్‌ల 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌(6) మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై అలెక్స్‌ క్యారీ (24), ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరారు. కుల్దీప్‌ బౌలింగ్‌లో క్యారీ ఔటయ్యాడు. అటు తర్వాత షాన్‌ మార్ష్‌-ఖవాజాల జంట అత్యంత నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను ఔట్ చేసిన జడేజా టీమిండియాకు మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు