లీడ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల గురించి చెప్పడం మొదలు పెడితే ఇప్పుడు పూర్తయ్యే ముచ్చట కాదు. లెక్కలెనన్నీ రికార్డులు ఈ భారత రథసారథి సొంతం. తాజాగా మరో అరుదైన రికార్డుకు కోహ్లి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. నేడు(శనివారం) శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో ఈ ఐదు పరుగులు చేస్తే భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ సరసన చేరుతాడు. ప్రపంచకప్(2011,2015, 2019)లో ఇప్పటి వరకు మొత్తం 24 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లి ఇప్పటి వరకు 995 పరుగులు చేశాడు. (చదవండి : ‘టాప్’ నీదా... నాదా?)
మరో ఐదు పరుగులు చేస్తే ప్రపంచకప్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ 44 ఇన్నింగ్స్లు.. 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 21 ఇన్నింగ్స్లు.. 1006 పరుగులతో రెండో స్థానంలో గంగూలీ ఉన్నాడు. వీరి తర్వాతి స్థానమే కెప్టెన్ కోహ్లిదే. కోహ్లి ఈ జాబితాలో చేరడంతో పాటు.. గంగూలీని కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇక కోహ్లి తర్వాత వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ (15 ఇన్నింగ్స్ల్లో 874 ), రాహుల్ ద్రవిడ్ (21 ఇన్నింగ్స్ల్లో 860) ఉన్నారు. రోహిత్కు కనుక మరోసారి శతకంతో మెరిస్తే వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగలడు. మరీ రోహితా? కోహ్లినా? అనేది మ్యాచ్లోనే చూడాలి.