‘నో డౌట్‌.. ఆ జట్టే ఐపీఎల్‌ విజేత’

23 Mar, 2019 16:04 IST|Sakshi

న్యూఢిల్లీ : క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌-12 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇక ఈ సారి ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకెల్‌ వాన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అభిమానులకు తీపి కబురు చెప్పారు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సారథ్యంలోని ఆర్సీబీనే టైటిల్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లను కూడా ఎవరు సొంతం చేసుకుంటారో వాన్‌ అంచనా వేశాడు.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఇస్తారు)ను సొంతం చేసుకుంటాడని, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌కు ఇస్తారు) గెలుచుకుంటాడని వాన్‌ అభిప్రాయపడ్డాడు. టైటిల్‌ను ఆర్సీబీనే కచ్చితంగా గెలుస్తుందని స్పష్టం చేశారు. ఇక దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. వాన్‌ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ కింగ్ కోహ్లి‌.. ఐపీఎల్‌ కింగ్‌ అవుతాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ తొలి పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.


 

>
మరిన్ని వార్తలు