నెట్‌ రన్‌రేట్‌ రూల్‌ మార్చండి: పాక్‌ కోచ్‌

6 Jul, 2019 15:30 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ టాప్‌-4లో ఉండకపోవడానికి నెట్‌రన్‌ రేట్‌ ప్రధాన కారణమైంది. పాకిస్తాన్‌ తమ లీగ్‌ దశ ముగించే సరికి 11 పాయింట్లతో ఉంది. అయితే అదే 11 పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరగా, పాకిస్తాన్‌ ఐదో స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇలా పాకిస్తాన్‌ నాకౌట్‌ చేరకుండానే నిష్క్రమించడం ఆ జట్టు కోచ్‌ మికీ ఆర్థర్‌ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దాంతో ఏకంగా నెట్‌ రన్‌రేట్‌ విధానాన్నే మార్చమంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్‌ నిష్క్రమించిన తర్వాత నెట్‌ రన్‌రేట్‌ రూల్‌ను పునః సమీక్షించాలని ఐసీసీకి విన్నవించాడు. పలు దేశాలు తలపడే మెగా టోర్నీలో ముఖాముఖి రికార్డును మాత్రమే పరిగణలోకి తీసుకునే సవరణలు చేయాలని సూచించాడు.

ఆర్థర్‌ అసంతృప్తి కారణం ఉంది. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించినందున అలా నెట్‌ రన్‌రేట్‌ను తీసుకుంటే తాము సెమీస్‌కు చేరే వాళ్లమన్నది ఆర్థర్‌ వాదన. అలా కాకపోవడంతో ఏకంగా ఎప్పుట్నుంచో కొనసాగుతున్న నెట్‌ రన్‌రేట్‌ విధానాన్నే మార్చాలంటూ ఆర్థర్‌ కోరడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తమ జట్టు సెమీస్‌కు చేరకపోవడంపై ఆర్థర్‌ మాట్లాడతూ.. వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాభవం చూడటం పాక్‌ జట్టు సెమీస్‌ అవకాశాల్ని దెబ్బ తీసింది. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో కూడా మేము గెలవాల్సిన ఉన్నా అది జరగలేదు. ఒక అత్యంత పేలవ ప్రదర్శనతోనే మా సెమీస్‌ దారులు మూసుకుపోవడం చాలా బాధాకరం. మళ్లీ మేము గాడిలో పడినప్పటికీ నెట్‌ రన్‌రేట్‌తో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇది మా డ్రెస్సింగ్‌ రూమ్‌ నిరుత్సాహపరిచింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత కూడా మేము అభినందనలు చెప్పుకోలేకపోయాం. ఏది ఏమైనా సెమీస్‌ రేసులో ఉన్న నాలుగు జట్లు కంగ్రాట్స్‌. వారు మంచి క్రికెట్‌ ఆడిన కారణంగానే సెమీస్‌కు వెళ్లారు. ఒక అత్యుత్తమ జట్టునే ట్రోఫీ వరిస్తుంది’ అని ఆర్థర్‌ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు