క్రికెట్‌కు మునాఫ్‌ పటేల్‌ వీడ్కోలు

11 Nov, 2018 02:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత పేస్‌బౌలర్‌ మునాఫ్‌ పటేల్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్‌ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు.

వరల్డ్‌కప్‌ గెలిచిన ఏడాదే ఇంగ్లండ్‌తో చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన మునాఫ్‌ ఆ తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక కాలేదు. ‘ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్‌ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది’ అని 35 ఏళ్ల మునాఫ్‌ పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు