‘పాక్‌ జెర్సీ’పై ఎంఎస్‌ ధోని పేరు

25 May, 2019 11:30 IST|Sakshi

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్‌కప్ ఫీవర్ మొదలైపోయింది. టోర్నీలో విజేతగా నిలిచే జట్టు గురించి ఒకవైపు క్రికెట్ పండితులు అంచనాలు వేస్తుండగా, మరోవైపు అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్‌‌కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పేరు.. పాకిస్తాన్‌ జెర్సీపై కనిపించడంతో అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానానికి అద్దం పడుతోంది. పాకిస్తాన్‌ చెందిన  వీరాభిమాని షెజాద్ ఉల్ హసన్.. ఏకంగా పాక్ జెర్సీపైనే ధోనీ పేరుతో అతని ‘లక్కీ నంబరు 7’ను వేయించి తన ప్రేమని చాటుకున్నాడు.  ఇలా ఒక పాకిస్తాన్‌ అభిమాని ధోని పేరుతో జెర్సీ తయారు చేయించుకోవడం గతంలో చూసిన సందర్భాలు లేవు.

ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. భారత్, పాకిస్తాన్ జట్లు జూన్ 16న ఢీకొననున్నాయి. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాక్‌తో మ్యాచ్‌ని భారత్ బహిష్కరిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ.. మ్యాచ్ ఆడేందుకు నిర్ణయించుకున్న టీమిండియా.. పాక్‌ని ఓడించడం ద్వారా అమర జవాన్లకి ఘన నివాళి అర్పించాలని ఆశిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ తలపడిన ప్రతీసారీ భారత్‌దే విజయం కావడం విశేషం. దీన్ని మరోసారి పునరావృతం చేయాలని విరాట్‌ సేన భావిస్తోంది.

మరిన్ని వార్తలు