ప్రజ్నేశ్‌కు తొలి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌

30 Apr, 2018 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ చాలెంజర్‌ సర్క్యూట్‌ టైటిల్‌ సాధించాడు. చైనాలోని యానింగ్‌ నగరంలో ఆదివారం ముగిసిన కున్‌మింగ్‌ ఓపెన్‌లో ప్రజ్నేశ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్నేశ్‌ 5–7, 6–3, 6–1తో మొహమ్మద్‌ సఫత్‌ (ఈజిప్ట్‌)పై గెలుపొందాడు.

గంటా 52 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అద్భుత ఆటతీరు కనబర్చిన ప్రజ్నేశ్‌ చివరకు విజేతగా నిలిచాడు. రెండేళ్ల క్రితం పుణే ఓపెన్‌ ఫైనల్లో ఓడిన అతను ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ఈ విజయంతో రూ. 14.30 లక్షల ప్రైజ్‌మనీతో పాటు 125 ర్యాంకింగ్‌ పాయింట్లు అతని ఖాతాలో చేరాయి. దీంతో నేడు విడుదల కానున్న ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్‌ టాప్‌–200లో చోటు దక్కించుకోనున్నాడు.

మరిన్ని వార్తలు