న్యూఢిల్లీ: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్కు ముందు తన బౌలింగ్ను సానబెట్టేందుకు కౌంటీలను ఎంచుకున్నాడు. ఈ మేరకు నాటింగ్హామ్షైర్ తరఫున ఈ ఆఫ్స్పిన్నర్ ఆరు మ్యాచ్లు ఆడే అవకాశముంది. ‘ఔను.. అశ్విన్ ఈ కౌంటీ సీజన్లో నాటింగ్హామ్షైర్ తరఫున బరిలోకి దిగుతాడు. పరిపాలక కమిటీ (సీఓఏ) ఇప్పటికే సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లకు కౌంటీలాడేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది.
అశ్విన్ ఒప్పందం ఇప్పటికే ఖరారైంది. రేపోమాపో బోర్డు సీఈఓ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేస్తారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 32 ఏళ్ల అశ్విన్కిది ఇంగ్లిష్ కౌంటీల్లో రెండో సీజన్. 2017లో అతను వార్సెస్టెర్షైర్ తరఫున నాలుగు మ్యాచ్లాడాడు. ఇప్పటికే భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానే హాంప్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బోర్డు కూడా కౌంటీ జట్లతో టచ్లో ఉంది. తమ ఆటగాళ్లకు కౌంటీ కాంట్రాక్టులు లభించేలా చొరవ తీసుకుంటుంది.