ఆ ఇద్దరూ మరీ ‘చెత్త’గా ఆడారు!

14 Mar, 2019 11:37 IST|Sakshi

ఢిల్లీ:  టీమిండియాకు మరింత సమస్యగా మారిన మిడిల్‌ ఆర్డర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్‌ నాటికి మిడిల్‌ ఆర్డర్‌పై ఒక స్పష్టత రాకపోతే ఆ మెగా టోర్నీలో అది భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఆసీస్‌తో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక భారత్‌ ఓడిపోవడంపై మంజ్రేకర్‌ విమర్శలు గుప్పించాడు. ప్రధానంగా భారత యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌లు చాలా నిరాశపరిచారన్నాడు. వారిద్దరూ ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నాడు.

‘పంత్, విజయ్‌ శంకర్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. వారిని నిరూపించుకునే ఛాన్స్‌ వచ్చింది. అయినా దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. విజయ్‌ శంకర్‌, పంత్‌లు భారీ షాట్లు ఆడవచ్చు. అందుకు గాల్లోకి భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తరహాలో గ్రౌండ్‌ షాట్లతోనే స్టైక్‌రేట్‌ను పెంచుకోవచ్చు. ఇది సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్‌కప్‌ ముందు భారత జట్టులో కొట్టిచ్చినట్లు కనబడిన సమస్య ఏదైనా ఉంటే అది మిడిల్‌ ఆర్డర్‌. ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న ఆసీస్‌కు సిరీస్‌ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. వారు భారత్‌కు ఎందుకొచ్చారో అది చేసి చూపించారు’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు