చివరి ఓవర్‌ హార్దిక్‌కు ఇవ్వాలి.. కానీ: రోహిత్‌

13 May, 2019 16:38 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 ఫైనల్‌ పోరులో అంతిమ విజయం ముంబే ఇండియన్స్‌కే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. దీంతో ముంబై ఖాతాలో నాలుగో టైటిల్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై.. ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది.

కాగా మ్యాచ్‌ అనంతరం ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ కప్‌ను నాలుగో సారి ముంబై అందుకోవడం చాలా గర్వంగా, అనందరంగా ఉందన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వెటరన్‌ బౌలర్‌ మలింగనే చాంపియన్‌ అంటూ పేర్కొన్నాడు.  ‘ముంబై విజయం అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే. మలింగ తన మూడో ఓవర్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యాతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపాను’ అని రోహిత్ వివరించాడు. 

>
మరిన్ని వార్తలు