భారత్‌ పోరాటం ముగిసింది..

27 Jul, 2019 11:58 IST|Sakshi

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌టూర్‌-750 టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భాగంగా సెమీ ఫైనల్లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్‌ 18-21, 12-21 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కెంటో మొమోటో చేతిలో పరాజయం చెందడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్‌.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. కేవలం 45 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి చెందాడు.

తొలి గేమ్‌ ఆరంభంలో సాయి ప్రణీత్‌ 3-1 ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత మొమోటో పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సాయి ప్రణీత్‌ను వెనక్కునెట్టాడు. అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు మొమోటో. ఇక రెండో గేమ్‌లో ప్రణీత్‌కు మొమోటో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస ఆరు పాయింట్లు సాధించి సాయి ప్రణీత్‌పై తిరుగులేని ఆధిక్యం సాధించాడు. దాంతో పుంజుకోలేక పోయిన సాయి ప్రణీత్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకున్నాడు.

మరిన్ని వార్తలు